Tuesday, April 13, 2010

యులిప్‌ బంతి కోర్టుకు!

సెబీ, ఐఆర్‌డీఏల తాత్కాలిక రాజీ
ఫలించిన ఆర్థిక శాఖ జోక్యం
14 కంపెనీలపై నిషేధం ఎత్తివేత
పాలసీలు నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు
బీమా కంపెనీలకూ ఉపశమనం
పాలసీదార్లకూ వూరట
యులిప్‌ కథ తాత్కాలికంగానైనా సుఖాంతమైంది. ఆర్థిక శాఖ జోక్యంతో పాలసీదార్లకు, బీమా కంపెనీలకు వూరట లభించింది. కోర్టులోనే వివాదాన్ని తేల్చుకోవడానికి సెబీ, ఐఆర్‌డీఏలు అంగీకరించడంతో పాటు 14 బీమా కంపెనీలపై సెబీ నిషేధం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంతో ఇది సాధ్యమైంది.
న్యూఢిల్లీ: యులిప్‌లను ఎవరు నియంత్రిస్తారు అనే విషయంపై బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ, మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీలు కోర్టులో తేల్చుకోవడానికి అంగీకరించాయి. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారమిక్కడ విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఎలాంటి అస్పష్టతకు తావులేకుండా.. మార్కెట్లో కార్యకలాపాలు సాఫీగా జరగడం కోసం రెండు నియంత్రణ సంస్థలు కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకోవడానికి సమ్మతించాయ'ని ఆయన పేర్కొన్నారు. అంతవరకూ నిషేధం ముందు పరిస్థితే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఐఆర్‌డీఏ, సెబీల యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. ప్రణబ్‌ ప్రకటన నేపథ్యంలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) బీమా కంపెనీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. సెబీ అధికార్లు ఐఆర్‌డీఏ, ఆర్థిక శాఖ అధికార్లను కలిసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం ఐఆర్‌డీఏ ఛైర్మన్‌ జె. హరినారాయణ్‌, సెబీ చీఫ్‌ సి.బి. భావేలు విడివిడిగా ఆర్థిక మంత్రి అధికార్లతో సమావేశం అయిన తర్వాత ప్రణబ్‌ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ) అనేది ఒక బీమా ఉత్పత్తి. వీటి ప్రీమియంలో ఎక్కువ శాతం ఈక్విటీలు బాండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు.

హైకోర్టుకు..?: ఏ కోర్టుకు వెళ్లొచ్చన్న విషయంపై ఆర్థిక కార్యదర్శి అశోక్‌ చావ్లాను ప్రశ్నించగా.. 'హైకోర్టుకు వెళ్లొచ్చని నేను భావిస్తున్నా'నన్నారు. కాగా, ఐఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండగా.. సెబీ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.

అసలేం జరిగిందంటే: యులిప్‌ల ద్వారా నిధులను సమీకరించే విషయంలో తమ అనుమతిని తీసుకోలేదని పేర్కొంటూ 14 బీమా కంపెనీలపై శుక్రవారం రాత్రిసెబీ నిషేధం విధించింది. ఆ జాబితాలో ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, టాటా ఏఐజీ, ఏగాన్‌ రెలిగేర్‌ లైఫ్‌, అవైవా లైఫ్‌, బజాజ్‌ అలియంజ్‌, భారతీ యాక్సా, బిర్లా సన్‌లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌, ఐఎన్‌జీ వైశ్యా లైఫ్‌, కోటక్‌ మహీంద్రా ఓల్డ్‌ మ్యూచువల్‌ లైఫ్‌, మాక్స్‌ న్యూయార్క్‌ లైఫ్‌, మెట్‌లైఫ్‌ ఇండియా, రిలయన్స్‌ లైఫ్‌లున్నాయి. ఆ తర్వాతి రోజే(శనివారం) సెబీ ఉత్తర్వును పట్టించుకోనక్కర్లేదనీ.. యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చనీ బీమా చట్టం సెక్షన్‌ 34(1)ను ఉటంకిస్తూ బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏ సూచించింది. దీంతో ఆ రెండు నియంత్రణ సంస్థల మధ్య అగ్గిరాజుకుంది. ఈ మొత్తం విషయం ఆర్థిక శాఖ దృష్టిలో పడడంతో.. భావే, హరినారాయణ్‌లతో ఆర్థిక కార్యదర్శి అశోక్‌ చావ్లా విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. దాని ఫలితమే ప్రణబ్‌ ప్రకటన.

పెట్టుబడులు సురక్షితమే: 'యులిప్‌లలో పెట్టుబడులు పెట్టిన మదుపుదార్ల నగదు సురక్షితంగా ఉంది. వారి క్లెయిమ్‌లు, ఉత్పత్తులు పూర్తి భద్రంగా ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేద'ని ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయం బయట విలేకర్లతో ఐఆర్‌డీఏ ఛైర్మన్‌ జె. హరినారాయణ్‌ పేర్కొన్నారు. అశోక్‌ చావ్లాతో సమావేశానికి ముందు ఆయన మాట్లాడారు. 'ఏదో నిర్ణయం తెలపడానికి నేనిక్కడకు రాలేదు. సమస్యను మా కోణం నుంచి చెప్పడానికి వచ్చా. యులిప్‌ ఉత్పత్తులపై సెబీకి న్యాయాధికారం లేదు. కానీ సెబీ అలా భావిస్తోంద'ని అన్నారు. సెబీ నిర్ణయం పాలసీదార్లపై, బీమా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అంతక్రితం పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఆర్థిక శాఖ దృష్టిలో యులిప్‌లు ఎంఎఫ్‌ల వంటివే!
న్యూఢిల్లీ: యూనిట్‌ లింక్డ్‌ బీమా పాలసీ (యులిప్‌)ల నియంత్రణ అధికారంపై సెబీ, ఐఆర్‌డీఏల మధ్య తగాదా తలెత్తడానికి చాన్నాళ్ల ముందు నుంచే ఆర్థిక శాఖ ఈ సాధనాలను స్థూలంగా మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌)లతో పోలిక ఉన్నవిగా భావిస్తూ వచ్చింది. ఎంఎఫ్‌లతో యులిప్‌లకు సామ్యం ఉన్నట్లు విత్త శాఖకు చెందిన ఎక్సైజ్‌, కస్టమ్స్‌ కేంద్ర మండలి (సీబీఈసీ) 2008 ఫిబ్రవరిలోనే అభిప్రాయపడింది. ఈమధ్య రెండు నెలల కిందట కూడా ఇదే దృష్టికోణాన్ని సీబీఈసీ పునరుద్ఘాటించింది. యులిప్‌లు బీమా నియంత్రణ- అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) నియంత్రణలో ఉండగా, మ్యూచువల్‌ ఫండ్‌లు సెబీ నియంత్రణ కింద కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న సీబీఈసీ ఒక సర్క్యులర్‌ను జారీ చేస్తూ, 'యులిప్‌లు స్థూలంగా మ్యూచువల్‌ ఫండ్‌లను పోలి ఉన్నవే, తేడా ఏంటంటే.. వాటి ప్రీమియంలో కొంత సొమ్మును ప్లాన్‌హోల్డరు జీవిత బీమాకు కేటాయించవలసి ఉండడమే'నని పేర్కొంది. పరోక్ష పన్నుల విభాగం 2008 ఫిబ్రవరి 29న ఒక సర్క్యులర్‌లో.. యులిప్‌లు పాలసీహోల్డర్‌కు సదరు పథకంలో ఉమ్మడిగా పాల్గొనే సౌలభ్యాన్నీ, తద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ల మాదిరిగా లబ్ధిదారు అయ్యే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి.. అని వివరించింది. 2008-09 బడ్జెటును సమర్పించిన సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం యులిప్‌ పరిధిలో సమకూరుతున్న అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సేవపై సేవా పన్నును విధించి యులిప్‌లను సేవల పన్ను పరిధిలోకి తేవాలని ప్రతిపాదించడం గమనార్హం. పైన పేర్కొన్న రెండు సర్క్యులర్‌లూ యులిప్‌లపై సేవా పన్నుకు సంబంధించినవే కావడం విశేషం.న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం మళ్లీ పడకేస్తోంది. ఉద్దీపన పథకాల నేపథ్యంలో క్రమేణా కోలుకుంటూ వచ్చిన పారిశ్రామికోత్పత్తి సూచీ తాజాగా ఫిబ్రవరి నెలలో 15.1 శాతానికి పరిమితమైంది. ఇది డిసెంబరులో 17.6 శాతం, జనవరిలో 16.7 శాతం వృద్ధితో పురోగమించిన విషయం తెలిసిందే. మొన్నీమధ్యే ప్రభుత్వం ఉద్దీపన పథకాలను పాక్షికంగా ఉపసంహరించుకోవడం, ఆర్‌బీఐ రెపో, రివర్స్‌ రెపో రేట్లను స్వల్పంగా పెంచడం వంటి చర్యలు రాబోయే రోజుల్లో పారిశ్రామిక రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే వచ్చే నెలల్లోనూ ఈ సూచీ మరింతగా దిగజారక తప్పదు.

పారిశ్రామిక వృద్ధి గణనకు పరిగణనలోకి తీసుకునే విభాగాల్లో 14 మెరుగైన పనితీరును కనబరిచినప్పటికీ సిమెంట్‌, స్టీలు రంగాలు నిరుత్సాహకరంగా ఉండటం వృద్ధి రేటును ప్రభావితం చేసింది. కిందటేడాది కేవలం 0.2 శాతం వృద్ధితో సరిపెట్టుకున్న తయారీ రంగం ఈ ఏడాది ఇదే నెలలో అనూహ్యరీతిలో 16 శాతం పురోగతి సాధించింది. అలాగే వినియోగ వస్తువుల తయారీ ఫిబ్రవరిలో 29.9%, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి 44.4% పెరిగాయి. తవ్వక రంగం 12.2%, విద్యుత్తు రంగం 6.7% వృద్ధిని నమోదు చేశాయి. మొత్తంమీద గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరి నెలల మధ్య పారిశ్రామికోత్పత్తి సూచీ 10.1% వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 3% మాత్రమే.

జీడీపీ 7.2శాతానికి తగ్గదు: నిపుణులు
మౌలిక రంగంలోని 6 కీలక విభాగాలు జనవరి (9.4%) కంటే ఫిబ్రవరిలో (4.5%) తక్కువ పురోగతి సాధించడం పారిశ్రామికోత్పత్తిపై ప్రభావం చూపిందని క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త డి.కె. జోషి తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్థిక విధానాలను కఠినతరం చేయడం వల్ల రాబోయే నెలల్లో ఐఐపీ మరింత తగ్గవచ్చు. అయినప్పటికీ 2009-10లో జీడీపీ 7.2% వృద్ధి సాధించవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారీ యంత్ర పరికరాలు, తయారీ రంగం పారిశ్రామిక వృద్ధికి దోహద పడ్డాయని, పెట్టుబడులకు తగినట్లు వినియోగం పెరిగినప్పుడే వృద్ధి స్థిరపడుతుందని యెస్‌ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త సుభదారావ్‌ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం పనితీరు మెరుగ్గా ఉన్నందున, ఉద్దీపనల ఉపసంహరణ దిశగా కేంద్రం సాగుతుందని వివరించారు.