
ఇబ్బందులు పడుతున్న మొబైల్ వినియోగదార్లు రాష్ట్రంలో ఎయిర్టెల్ కస్టమర్లు తక్కువేం కాదు. ఎంతో ఇష్టపడి తీసుకున్న ఎయిర్టెల్ కనెక్షను ఇప్పుడు వారికి ఇబ్బందికరంగా మారుతోంది. చేతిలో ఫోను ఉంటుంది. కానీ.. లైను దొరకదు. దొరికినా.. మాట్లాడుతూ ఉండగా మధ్యలో కట్ అయిపోతుంది. నగరం నడిబొడ్డున ఉన్నా సిగ్నల్ దొరకదు. ఇక దూర ప్రాంతాల సంగతి సరేసరి. ప్రస్తుతం ఎయిర్టెల్ వినియోగదార్లు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇది. సమస్యకు సత్వర పరిష్కారాన్ని ఎయిర్టెల్ కనుక్కోకపోతే భవిష్యత్తులో వినియోగదార్ల కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కారణం త్వరలో నంబరు పోర్టబులిటీ (నంబరు మారదు కానీ, ఆపరేటరును మార్చుకోవచ్చు) అందుబాటులోకి రానుండటమే.
ఫిర్యాదులపై కాల్సెంటర్ కేంద్రాల ఉదాసీనత
ఎయిర్టెల్ చందాదారులకు ఇంకొంచెం ఎక్కువ కష్టాలుహైదరాబాద్ - న్యూస్టుడే

పీక్ సమయాల్లో అవస్థలు
ఎక్కువ మంది ఫోన్ మాట్లాడే సమయంలో (పీక్ సమయం) నెట్వర్క్కు ట్రాఫిక్ ఎక్కువై ఎయిర్టెల్ చందాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9-10, సాయంత్రం 7-8 గంటల మధ్య, వారాంతాలు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో చందాదారులు ఎక్కువ మాట్లాడతారు. హైదరాబాద్లోని కొన్ని కీలక కూడళ్లలోని టవర్లపై అధిక భారం పడి ఇటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ఈ ప్రాంతాల్లో టవర్ సామర్థ్య వినియోగం 80-90 శాతం వరకు ఉంటుంది. అంతకు మించినప్పుడు చందాదారుడు ఫోన్ చేయడానికి వేచి ఉండక తప్పడం లేదు. ఒక్కో టవర్కు మూడు సెక్టార్స్, గరిష్ఠంగా 30 రేడియోలు ఉంటాయని, ట్రాఫిక్ పెరిగినప్పుడు ఆ ప్రాంతంలో మరో టవర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గరలో అనువైన స్థలం లభించకపోవడం, ఏర్పాటులో జాప్యం కారణంగా చందాదారులకు తరచు ఫోన్లు కలవవని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేనప్పుడు డీజిల్ ఇంజిన్పై సెల్సైట్ పని చేస్తుంది. డీజిల్ అందుబాటులో లేనప్పుడు ఆ టవర్ ట్రాఫిక్ను పక్క టవర్కు మళ్లిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో భారం పెరుగుతుంది.
సంస్థ ఏమంటోందంటే..
ప్రతి నెల ట్రాఫిక్కు అనుగుణంగా నెట్వర్క్ను తీర్చిదిద్దుతామని అయితే.. కొత్త భవనాలు, నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాల కారణంగా ఫోన్ చేసినప్పుడు కలవకపోవడానికి అవకాశం ఉంటుందని ఎయిర్టెల్ ప్రతినిధి చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమకు 10 వేల వరకు టవర్లు ఉన్నట్లు చెప్పారు. ఆరు నెలలకు ముందే అవసరాలను అంచనావేసి తదనుగుణంగా సామర్థ్యాలను పెంచుతామని వివరించారు. అక్కడున్న ట్రాఫిక్ అవసరాల కంటే టవర్లకు 30 శాతం అదనపు సామర్థ్యం (బఫర్) ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో టవర్ సామర్థ్యంలో 40-50 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాం. ఫోన్ కలవకపోవడం, కాల్ డ్రాపింగ్ వంటి సమస్యలు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని అంటున్నారు. అయితే.. చందాదారులు మాత్రం సమస్య తీవ్రంగా ఉందని వాపోతున్నారు.
కొన్ని సమస్యలు
* ఫోన్ చేసిన వెంటనే తరచు లైన్లు దొరక్కపోవడం.
* మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా అంతరాయం (కాల్ డ్రాపింగ్) కలగడం.
* కస్టమర్ కేర్ కేంద్రానికి ఫోన్ చేస్తే ఆశించిన ఫలితం దక్కకపోవడం.
* కొన్ని సందర్భాల్లో వాడని సేవలకు బిల్లులు (పోస్ట్ పెయిడ్ కస్టమర్ల విషయంలో) రావడం.
* తప్పుడు బిల్లులను సరిదిద్ది తిరిగి సొమ్ము వాపసు ఇవ్వడం (ఇవ్వాల్సి ఉంటే)లో కాలయాపన.
గణాంకాలు
* రాష్ట్రంలో ఎయిర్టెల్ వాటా 28 శాతం.
* చందాదార్లు దాదాపు 1.26 కోట్ల మంది.
* ప్రతి నెల దాదాపు 2 లక్షల మంది కొత్త చందాదారులను కంపెనీ ఆకర్షిస్తోంది.
* ప్రత్యేక పథకాలు, పండగల సమయంలో ఈ సంఖ్య 3 లక్షల వరకు ఉంటుంది.