
అధిక గిరాకీతో పెరిగిన ధర
కొన్ని ప్రాంతాల్లో రూ.250 పలుకుతున్న బస్తా!
హైదరాబాద్ - న్యూస్టుడే
కోరినంత సిమెంటు మార్కెట్లో లేదు!: ధర విషయానికి వస్తే గత కొద్ది నెలలుగా పెరుగుతున్న వరుసలోనే ఈ నెలలోనూ సిమెంటు ధర ఎగసింది. ఈ నెల మొదటి వారంలో బస్తా సిమెంటుకు రూ.20 వరకు పెంపుదలను ఉత్పత్తిదార్లు వర్తింపజేశారు. దీంతో హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఇప్పుడు సిమెంటు బస్తా ధర రూ.225 అయ్యింది. కాస్త సుదూర ప్రాంతాలైన శ్రీకాకుళం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రూ.250 వరకూ ధర చెల్లిస్తే కానీ సిమెంటు లభ్యం కాని పరిస్థితి ఉందంటున్నారు. దీనిపై 'న్యూస్టుడే' స్థానిక సిమెంటు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడగా, కేవలం మనరాష్ట్రంలోనే సిమెంటు ధర పెరగడం లేదని, దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిమెంటు ధర వేగంగా పెరుగుతున్న విషయాన్ని గమనించాలన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సిమెంటు ధర బస్తాకు రూ.300 మించిందని, దక్షిణాదిన కేరళలో రూ.290 ధర ఉన్నట్లు పేర్కొన్నారు. అసలు డిమాండుకు తగ్గట్లుగా సిమెంటు మార్కెట్లో లేదని ఆ వర్గాలు వివరిస్తున్నాయి.
మూడో త్రైమాసికంలో రూ.83 లక్షల లాభం: 2009-10 ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలానికి అంజనీ పోర్ట్ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్ ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం మొత్తం ఆదాయం రూ.106.90 కోట్లు కాగా, దీనిపై రూ.13.71 కోట్ల నికరలాభం నమోదైంది. మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.26.24 కోట్లు, నికరలాభం రూ.83 లక్షలు ఉన్నాయి. కంపెనీ జారీ మూలధనం రూ.18.38 కోట్లు ఉంది. సిమెంటుకు గిరాకీ, ధర రెండూ అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో అదనపు సామర్థ్యం అందుబాటులోకి వచ్చినందున కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం (2010-11)లో ఆదాయాలు, లాభాలు మెరుగ్గా ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.