Tuesday, March 2, 2010

పెట్రో పెంపును ఉపసంహరించండి :ప్రధాని, సోనియాలకు మమత లేఖ

పెట్రో పెంపును ఉపసంహరించండి
ప్రధాని, సోనియాలకు మమత లేఖ
ఉద్యమం తీవ్రం చేస్తాం: ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: చమురు ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రధాని మన్మోహన్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాలకు కేంద్ర రైల్వేమంత్రి మమతాబెనర్జీ లేఖ రాశారు. సాధారణ ప్రజల కోసమే తప్ప ఎవరినీ ఢీకొనే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదన్నారు. మీడియాతో శనివారం మమత మాట్లాడారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై మరో భారం మోపటం తగదని.. ఈ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. సగటుజీవి ప్రయోజనాలను కాపాడటానికే తాను రైలు టికెట్‌ ధరలు పెంచలేదని చెప్పారు. చమురు ధరల పెంపు నిర్ణయానికి ముందు తమ పార్టీ అభిప్రాయం తీసుకోలేదన్నారు.

దూరదృష్టి లేదు: భాజపా
బడ్జెట్‌ అలిసిసొలిసిన వ్యక్తి తయారుచేసినట్టుగా ఉందే తప్ప దాంట్లో ఉత్సాహం, దూరదృష్టి లేవని లోక్‌సభలో ప్రతిపక్షనేత, భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్‌ విమర్శించారు. వ్యవసాయం, సాగునీటితోపాటు ఇతర రంగాలకు జరిపిన అరకొర కేటాయింపుల వల్ల ప్రగతి సాధ్యం కాదన్నారు. గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన స్వర్ణచతుర్భుజి, నదుల అనుసంధానం వంటి పథకాల అమలులో యూపీఏ సర్కారు నిర్లక్ష్యం చూపుతోందన్నారు. ఎన్‌డీఏ పక్షాలను కూడగట్టుకొని ధరల పెంపుపై లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రభుత్వాన్ని ఎండగడతామని భాజపా అధికార ప్రతినిధి రవిశంకర్‌ప్రసాద్‌ తేల్చిచెప్పారు.

పారిశ్రామికవేత్తలకు రాయితీలా: సీపీఐ
సాధారణ వ్యక్తులు, రైతులు బతకటానికే నానాతంటాలు పడుతుంటే యూపీఏ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాయితీలు కొనసాగించటం ఆశ్చర్యం కలిగిస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి.బర్ధన్‌ అన్నారు. శుక్రవారం పార్లమెంటులో తమ వాకౌట్‌.. నిత్యావసరాల ధరల విజృంభణపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనలనే ప్రతిబింబించిందని తెలిపారు. యూపీఏ విధానాలను ప్రజలు ప్రతిఘటించే రోజు ఎంతో దూరం లేదని, ఆ ఉద్యమంలో తమ పార్టీ కీలకపాత్ర వహిస్తుందన్నారు. కేంద్రబడ్జెట్‌ను రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్‌గా జనతాదళ్‌(యు) పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పుడు కేంద్రం ధరలు పెంచటమేమిటని ఆర్జేడీ ప్రశ్నించింది. ధరల పెరుగుదలపై ఉద్యమం నిర్మిస్తామని ఆ పార్టీ నేత షకీల్‌అహ్మద్‌ఖాన్‌ పాట్నాలో ప్రకటించారు.