ఇంజినీరింగ్ అధ్యాపకుల వేతనాలు
రూ.4 వేలతో మొదలు
యాజమాన్యం దగ్గరే నియామక పత్రాలు

* సహాయ ఆచార్యుడికి రూ.24,000, సహ ఆచార్యుడికి రూ.35,000, ఆచార్యుడికి రూ.45 వేలు వేతనంగా ఇవ్వాలి. ఎక్కడో తప్ప అమలు కావడం లేదు. ఆరో వేతన సంఘం సూచనల ప్రకారం అయితే రూ.35000, రూ.50000, రూ.80,000 చొప్పున ఇవ్వాల్సి ఉంది.
* పేరున్న కళాశాలల్లో ఎంటెక్, పీహెచ్డీ ఉన్న అధ్యాపకులకు రూ.20 వేల నుంచి రూ.35 వేలు చెల్లిస్తున్నారు. భౌతిక శాస్త్రం, ఆంగ్లం, లెక్కలు, రసాయన శాస్త్రం బోధించే అధ్యాపకులకు 6-8 వేల రూపాయల వేతనం ఇస్తున్నారు.
* పీహెచ్డీ అర్హత కలిగిన వారికి కాస్త డిమాండ్ ఉంది. ఎక్కువ మంది అధ్యాపకులు బీటెక్ అర్హతతోనే పాఠాలు చెబుతున్నారు.
* చాలామంది అధ్యాపకులకు నియామక పత్రాలు లేవు. మరికొన్ని చోట్ల నియామక పత్రాన్ని ఇస్తూనే, తిరిగి తీసుకొని తమ దగ్గర పెట్టుకుంటున్నాయి.
* కొన్నిచోట్ల 'సెమిస్టర్' పద్ధతిలో గుత్త వేతనాలు కుదుర్చుకుంటున్నారు.
* ఇబ్రహీంపట్నం లాంటి చోట్ల పక్కపక్కనే ఇంజినీరింగ్ కళాశాలలు ఉండటంతో వారానికి మూడు రోజులు ఒక కళాశాలలో, మరో మూడు రోజులు ఇంకో కళాశాలలో బోధకులుగా పనిచేస్తున్నారు. వీరికి అక్కడ 'మొబైల్ ఫ్యాకల్టీ'గా ముద్దుపేరు పెట్టుకున్నారు.
* అధ్యాపకులు ఒకే కళాశాలలో నిలకడగా పని చేయడం లేదు. వెయ్యి రూపాయలు ఎక్కువ వచ్చినా చాలునని పరిగెత్తుతున్నారు.
* విధుల నిర్వహణలో యాజమాన్యంతో తలెత్తే సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులను సంప్రదించే అవకాశమే అధ్యాపకులకు లేదు.
* అధ్యాపకుల నియామకంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్దేశించిన ప్రమాణాలను ఎవరూ పాటించడం లేదు. కళాశాలలకు అనుమతులు, కోర్సుల గుర్తింపుల మంజూరు సమయంలో పారదర్శకత ఉండటం లేదు.
* ఇచ్చే స్వల్ప వేతనాలూ సకాలంలో అందడం లేదు. కొన్ని కళాశాలల యాజమాన్యాలకు ఆర్థిక సమస్యలు లేకున్నా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ... అధ్యాపకుల వేతనాలను రెండు, మూడు నెలలు ఆలస్యంగా చెల్లిస్తున్నాయి.
* రాష్ట్ర ప్రభుత్వం బోధనా ఫీజు చెల్లింపు పథకం కింద నిధుల చెల్లింపులో తీవ్ర జాప్యం కూడా అధ్యాపకుల వేతనాల చెల్లింపుపై ప్రభావం చూపుతోంది.