ధరలు పెంచిన మహీంద్రా
కనిష్ఠం: రూ.2,500 గరిష్ఠం: రూ.18,000
బడ్జెట్ భారం
న్యూఢిల్లీ: బడ్జెటులో ఎక్సైజ్ సుంకాన్ని 2 శాతం పెంచాలని ప్రతిపాదించిన దరిమిలా మహీంద్రా అండ్ మహీంద్రా తన వాహనాల ధరలను పెంచింది. కంపెనీ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ పవన్ గోయెంకా శనివారమిక్కడ విలేకరులకు తెలిపారు. వివిధ మోడళ్ల ధరలను కనీసం రూ.2,500 (త్రిచక్ర వాహనాలకు) నుంచి గరిష్ఠంగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ 'స్కార్పియో'పై రూ.18,000 దాకా పెంచినట్లు పవన్ గోయంకా చెప్పారు. 9 కొత్త వాహనాలు ప్రవేశపెడతాం: ఇప్పటి నుంచి వచ్చే నెల లోపు ఎం అండ్ ఎం ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వివిధ విభాగాల్లో తొమ్మిది కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తామని పవన్ గోయంకా వెల్లడించారు. ఇందులో భాగంగా మాక్సిమో మినీ ట్రక్కు విద్యుత్తు వెర్షన్ను మార్చి నెలాఖరు కల్లా ప్రవేశపెట్టనున్నామన్నారు.