Tuesday, March 2, 2010

పసిడిపై దిగుమతి సుంకం తొలగించమంటే.. పెంచారు

పసిడిపై దిగుమతి సుంకం
తొలగించమంటే.. పెంచారు
కష్టకాలంలో మద్దతు కరవు
బులియన్‌ వర్గాల ఆవేదన
అధిక ధర వల్ల అమ్మకాలపై ప్రభావం ఉండదు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సాధారణంగా బడ్జెట్‌ కన్నా ముందు పరిశ్రమ వర్గాలు తమ కోర్కెలను ఆర్థిక మంత్రికి చెప్పుకొంటాయి. సాధ్యాసాధ్యాలను పరిశీలించి అనుగ్రహించడం మంత్రి విశేషాధికారమన్నది తెలిసిందే. బంగారంపై దిగుమతి సుంకాన్ని తొలగించాలని నగల వ్యాపారులు కోరితే, అందుకు భిన్నంగా 50 శాతం పెంచారు. 'అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్‌ విలువలో ఒడుదొడుకుల కారణంగా పుత్తడి ధర బాగా హెచ్చు తగ్గులకు లోనవుతోంది. ఈ పరిస్థితుల్లో దిగుమతులపై సుంకాన్ని తొలగించాలని కోరాం. దీనికి బదులు 10 గ్రాముల బంగారం, ప్లాటినంపై సుంకాన్ని రూ.200 నుంచి రూ.300లకు పెంచి, కిలో వెండిపై అదనంగా రూ.500 విధించారు' అంటూ బులియన్‌ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నగలు, ఆభరణాల అమ్మకాలపై సుంకం పెంపు ప్రభావం ఉండనప్పటికీ.. ఇప్పటికే ఎక్కువగా ఉన్న ధరకు స్వల్పంగా అదనపు భారం కానుంది. ధర ఎక్కువగా ఉండడమే కాక ఒడుదొడుకులకు లోనవుతోంది. కస్టమ్స్‌ సుంకాన్ని పెంచడం వల్ల దేశ, విదేశీ ధరల మధ్య వ్యత్యాసం పెరుగుతుందని హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి ఒకరు అన్నారు. 'ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం కేజీ ధర దాదాపు రూ.17,00,000 ఉంది. ధరలు బాగా ఒడుదొడుకులకు లోనవుతున్నందున దిగుమతి సుంకం రూ.10,000 పెరిగినప్పటికీ (కేజీపై) దాని ప్రభావం నగలు, పసిడి అమ్మకాలపై ఉండదు' అని చందన బ్రదర్స్‌ ఎండీ జె.రామారావు వివరించారు.

ధర స్థిరపడుతున్న తరుణంలో..: గత డిసెంబరులో 10 గ్రాముల బంగారం ధర రూ.18,000 దాటింది. ఈ ఏడాదిలో రూ.15,500 నుంచి రూ.16,000 మధ్య స్థిరపడవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధర స్థిరపడితే.. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటివరకు బులియన్‌ వర్గాలు భావించాయి. తాజా నిర్ణయం వల్ల దిగుమతులపై ప్రభావాన్ని పరిశీలిస్తున్నారు. 'గత ఒకటి రెండు సంవత్సరాలుగా పసిడి ధర ఎక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు పాత బంగారాన్ని బాగా విక్రయించారు. వ్యాపారులు కూడా చాలా స్వల్పంగా దిగుమతి చేసుకున్నారు. దీంతో దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2007లో దాదాపు 797 టన్నుల పైడి దిగుమతి అయింది. 2008లో 439 టన్నులకు తగ్గింది. గత ఏడాదికి 200 టన్నులకే పరిమితం కాగలదని అంచనా వేసినప్పటికీ, 340 టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఈసారి (2010) దిగుమతులు 500 టన్నులను మించగలవని భావిస్తున్నారు. తాజా నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి..' అని జంటనగరాల బులియన్‌ వర్తకుల సంఘం ప్రతినిధి తెలిపారు. దిగుమతి చేసుకున్న బంగారంతో నగలు తయారు చేసి ఎగుమతి చేస్తే ఆ బంగారంపై దిగుమతి సుంకం ఉండదు.

ఎగుమతులపైనా చిన్న చూపే
మద్దతు ఇచ్చి ఆదుకోవలసిన తరుణంలో ప్రభుత్వం వెనుకడుగు వేసిందని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. ఎగుమతిదారులకు 2 శాతం వడ్డీ మినహాయింపును వచ్చే ఏడాది మార్చి వరకు బడ్జెట్‌లో పొడిగించారు. అయితే.. దీన్ని రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు వర్తింపచేయలేదని జీజేఈపీసీ ఛైర్మన్‌ వసంత్‌ మెహతా తెలిపారు. దీనివల్ల పోటీ దేశాలతో పోలిస్తే ఎగుమతిదారులకు నగల తయారీ వ్యయం పెరుగుతుంది. దీని ప్రభావం ఎగుమతులపై ఉంటుందని ఆయన అన్నారు. 2008-09లో విలువైన రాళ్లు, ఆభరణాల పరిశ్రమ 2500 కోట్ల డాలర్ల ఎగుమతులు చేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా గత ఏడాదిన్నర కాలంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ఈ పరిశ్రమకు కేంద్రమైన సూరత్‌లో కొన్ని వేల మంది శ్రామికులు ఉపాధి కోల్పోయారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌) పెంపు కూడా నగల అమ్మకాలను ప్రభావితం చేస్తుందని బులియన్‌ వ్యాపారులు చెబుతున్నారు. బంగారం ఆభరణాలకు మెరుగు దిద్దే రోడియమ్‌ దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం, ఇతర మార్పుల వల్ల కలిగే ప్రయోజనం స్వల్పమేనని నగల తయారీదారులు అంటున్నారు.