Tuesday, March 23, 2010

హవా చిన్న కార్లదే ...


గుర్తించిన కంపెనీలు
ప్రణాళికలతో కసరత్తు
నిస్సాన్‌-రేనాల్ట్‌దిచౌక కారు ముందు వరుస
నానో కంటే కు యత్నాలు
తన్‌ టాటా 'లక్ష కారు' ప్రకటించినప్పుడు ఇదెటూ సాధ్యం కాదని వాహన కంపెనీలన్నీ కొట్టిపారేశాయి. కానీ.. నానో కారు రోడ్డెక్కడంతో ఆ సెగ అన్ని కంపెనీలకూ తగిలింది. చిన్న కార్ల విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని ఆయా కంపెనీలు గుర్తించాయి. నానోకు పోటీ కారుపై కసరత్తులు ప్రారంభించాయి. ఈ కోవకు చెందినదే ఫ్రెంచి వాహన దిగ్గజం రేనాల్ట్‌. జపాన్‌కు చెందిన నిస్సాన్‌తో జట్టు కట్టిన రేనాల్ట్‌.. మహీంద్రా అండ్‌ మహీంద్రాతో కలిసి 'లోగాన్‌' కారును మనదేశంలో విక్రయిస్తోంది. దాంతోపాటు 'నానో' శ్రేణి చిన్నకారు తయారీకి బజాజ్‌ ఆటోతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు.. తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2012 కల్లా తన చిన్నకారును భారతీయ రోడ్లపై పరుగులు తీయించాలనేది రేనాల్ట్‌ ప్రణాళిక. అంతేకాదు.. నానో కంటే తక్కువ ధరకే ఈ కారును అందించాలనీ భావిస్తోంది. కేవలం భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే కాదు.. ఇదే కారును ఇరాన్‌, ఇరాక్‌, నైజీరియా, ఇండోనేషియా తదితర దేశాలకు తీసుకు వెళ్లవచ్చని గట్టి విశ్వాసంతో ఉంది.

మారుతున్న సమీకరణాలు
టాటా నానో దేశీయ కార్ల మార్కెట్‌ సమీకరణాలను బహుముఖంగా ప్రభావితం చేసినందనడంలో సందేహం లేదు. కార్ల తయారీ కంపెనీలు తమకు తోచిన కార్లు తయారు చేసి వినియోగదార్ల మీద రుద్దే పరిస్థితి పోయి, వినియోగదార్లకు ఎటువంటి కారు అవసరం అని ఆలోచించేందుకు ఈ పరిణామం దోహదపడింది. ప్రస్తుతం చిన్న కార్ల మార్కెట్లో మారుతీ, హ్యుందాయ్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఇప్పుడు అటువంటి అగ్రశ్రేణి కంపెనీలు సైతం నానోను తట్టుకోవడానికి కాస్తఅటూ ఇటుగా అదే శ్రేణి కార్లను తయారు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మారుతీ చిన్న కార్ల శ్రేణిలోని అస్త్రాలన్నీ ఖర్చయిపోయి, కొత్తకార్ల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి ఉంది. 'మారుతీ 800' ఇంకెంతకాలమో వినియోగదార్లను ఆకట్టుకోలేదు. ఇప్పటికే మెట్రో నగరాలన ఉంచి ఈ కారు వైదొలగింది. ఇదే శ్రేణి కారు మరొకదాన్ని కంపెనీ ఇంతవరకూ తయారు చేయలేదు. ఇక హ్యుందాయ్‌ విషయానికి వస్తే, దాని ప్రారంభ కారైన శాంట్రోకు కూడా దాదాపు ఇదే పరిస్థితి. దశాబ్దకాలం పాటు భారతీయ వినియోగదార్లను ఆకట్టుకున్న శాంట్రో ఇప్పుడు నెమ్మదిగా కొత్త మోడళ్లకు దారిస్తూ తప్పుకోవలసిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈపరిస్థితిని రెండు కంపెనీలు గుర్తించినట్లున్నాయి. అందుకే మారుతీ, జపాన్‌లో వాడుకలో ఉన్న 700 సీసీ కారునొకదాన్ని భారతీయ మార్కెట్లో ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా తీర్చిదిద్ది విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అదేవిధంగా హ్యుందాయ్‌ కూడా శాంత్రో కారుకు ఇప్పుడు వినియోగిస్తున్న 1.1 లీటర్‌ ఇంజిన్‌ స్థానంలో 700-800 సీసీ ఇంజిన్‌ను వినియోగించి, వినూత్నమైన డిజైన్‌తో తక్కువ ధరకే భారతీయ మార్కెట్లో ప్రవేశపెడితే ఎలా ఉంటుందనే విషయంలో విస్తృత పరిశోధనలు చేస్తోంది. ఏదైమైనా కార్ల మార్కెట్లో , ముఖ్యంగా ప్రారంభశ్రేణి చిన్న కార్ల మార్కెట్లో వచ్చే నాలుగైదేళ్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని స్పష్టమవుతోంది. దీనివల్ల దేశీయ కార్ల మార్కెట్‌ అతిపెద్దదిగా రూపాంతరం చెందబోతోంది. ఇప్పటికే రెండు మిలియన్ల వార్షిక విక్రయాలను చేరుకుంటున్న కార్ల పరిశ్రమలో అత్యంత వేగవంతమైన వృద్ధి కనిపించనుందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

అన్ని కంపెనీలదే అదే వరస
ప్రారంభ శ్రేణి కాకుండా 'బి' సెగ్మెంట్‌లోని బి ప్లస్‌, బి మైనస్‌ విభాగంలోని కార్లపై ఇప్పుడు అన్ని కార్ల కంపెనీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. పోటీలుపడి కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి. ఒకప్పుడు ఈ విభాగంలో కేవలం మారుతీ సుజుకీ, తర్వాత హ్యుందాయ్‌ మోటార్‌ ఉండేవి. కొద్దికాలానికి దేశీయ కంపెనీ అయిన టాటా మోటార్స్‌ ప్రవేశించింది. దేశీయ కార్ల అమ్మకాల్లో ఈ విభాగం వాటా 50 శాతం వరకూ ఉండటంతో ఇంత పెద్ద విభాగంలో లేకపోతే భారతీయ మార్కెట్లో మనుగడ లేదని విదేశీ కార్ల కంపెనీలన్నీ గుర్తించాయి. అందుకే పోటీపడి కొత్త కార్లు అందిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫోర్డ్‌ ఫిగో, వోక్స్‌వ్యాగన్‌ పోలో ఈ కోవలోనివే. పైగా ఫోర్డ్‌ ఫిగో ప్రారంభ ధరను ఫోర్డ్‌ మోటార్‌ ఎంతో ఆకర్షణీయంగా రూ.3.5 లక్షలే నిర్ణయించడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఈ విభాగంలో కొత్త మోడళ్లను తీసుకువచ్చిన కంపెనీల్లో ఫియట్‌ గ్రాండ్‌ పుంటో, హోండా జాజ్‌, అంతకు ముందే మార్కెట్లోకి వచ్చిన స్కోడా ఫాబియో ఉన్నాయి. టయోటా మోటార్‌ కంపెనీ కూడా వచ్చే ఏడాది, రెండేళ్ల వ్యవధిలో బి ప్లస్‌ శ్రేణి కారును తీసుకువచ్చే సన్నాహాలు చేస్తోంది.


ఇంకా బాలారిష్టాలు
డెలివరీలు తక్కువే
'లగ్జరీ'కి ఆదరణ
2009 మార్చి 23. నానో విడుదలైన రోజు ఇది.
బైక్‌ల దూకుడుకు పగ్గం వేస్తూ.. సామాన్యుడి కారు కల నెరవేర్చే లక్ష్యంతో పురుడు పోసుకున్న 'నానో' కారు సందడి ఇప్పటికీ తక్కువే. అయితే నానో ఇంకా బాలారిష్టాలను అధిగమించాల్సిన దశలోనే ఉండటంతో కార్ల డెలివరీలు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. త్వరలోనే సందుసందునా నానో సందడి చూడొచ్చనే భావించొచ్చు.

2011లోపు డెలివరీలు
కిందటేడాది ఏప్రిల్‌ 9-23 తేదీల మధ్య 2,06,703 మంది నానో కార్లు బుక్‌ చేసుకున్నారు. తొలివిడతలో లక్ష మందికి, అనంతరం 55,021 మందికి డెలివరీ ఇచ్చేందుకు టాటా మోటార్స్‌ సన్నాహాలు చేసింది. వీరందరికీ 2011 లోపు కార్లను డెలివరీ ఇవ్వనున్నారు. 2010లోపు డెలివరీ ఇవ్వలేకున్నా, కారుకు చెల్లించిన ధరావత్తు మొత్తాన్ని వాపసు తీసుకోనివారికి 8.75% వడ్డీని టాటా మోటార్స్‌ చెల్లించనుంది. ఇప్పటికి 40,000 లోపు కార్లు మాత్రమే కొనుగోలుదార్ల చేతికి అందాయి. వాస్తవానికి కస్టమర్లు బేసిక్‌ మోడల్‌ (లక్షకారు) కంటే కాస్త ఖరీదైన, ఆధునిక సదుపాయాలున్న మోడళ్లనే ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఒక షోరూంలో నెలకు 100-125 నానో కార్లు డెలివరీ ఇస్తుంటే, విజయవాడలో 40-50 అందచేస్తున్నారు.

బెంగాల్‌ నుంచి గుజరాత్‌కు..
2008, జనవరి 10న ఆటో ఎక్స్‌పోలో తొలిసారి నానోను ప్రదర్శించిన తర్వాత తొలి కారు తాళం చెవులను కస్టమరుకు అందించడానికి కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే పట్టింది. ఈలోగా ఎన్నో అవాంతరాలు. కార్లను తయారుచేసే కర్మాగారం పశ్చిమ బెంగాల్‌ నుంచి గుజరాత్‌కు తరలిపోవడం ఇందులో ప్రధానమైనది. తద్వారా రూ.1500 కోట్ల నష్టాన్ని టాటా మోటార్స్‌ తలకెత్తుకోవాల్సి వచ్చింది. ఏడాదికి 2,50,000 కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో సనంద్‌ ప్లాంటు సిద్ధమవుతోంది.

సౌకర్యాలకే ప్రాధాన్యం
టాటా మోటార్స్‌ రూ.లక్షకు అందిస్తున్న కారుకు పన్నులన్నీ చెల్లించేసరికి రూ. 1.25 లక్షల వరకు అవుతోంది. అదే రూ.1.50 లక్షలు (ఆన్‌రోడ్‌) వ్యయమయ్యే సీఎక్స్‌ మోడల్‌లో ఏసీ, సీట్ల సర్దుబాటు సదుపాయాలున్నాయి. ప్రస్తుతం వ్యాట్‌ రోడ్‌ట్యాక్స్‌ పెరిగినందున రూ.2.17 లక్షలు అవుతున్న సీక్స్‌ మోడల్‌లో ఏసీ, అడ్జెస్ట్‌బుల్‌ సీట్లు, టింటెడ్‌ గ్లాసులు, సెంట్రల్‌లాకింగ్‌, ఫాగ్‌ ల్యాంపుల వంటి సదుపాయాలున్నాయి. అందువల్ల బేసిక్‌ మోడల్‌ కంటే, మిగిలిన మోడళ్లపైనే కొనుగోలుదార్లు మక్కువ చూపుతున్నారు.

వినియోగదార్ల మాట
* 2 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కావడంతో, స్కూటర్‌ మాదిరి శబ్దం వస్తోంది.
* క్షణాల్లో వేగం పుంజుకుంటున్నా, 70 కిలోమీటర్ల వేగం దాటితే, అదురుతోంది.
* ట్యాంకులో 15 లీటర్ల పెట్రోల్‌ మాత్రమే నింపవచ్చు. దూర ప్రయాణాల కంటే స్థానికంగా తిరిగేందుకు బాగుంది.


మారుతీ ఖ్యాతి
నేడు పది లక్షలవ కారు విడుదల
న్యూఢిల్లీ: ఏడాది వ్యవధిలో 10,00,000 అంతకంటే ఎక్కువ కార్లు ఉత్పత్తి చేసిన కంపెనీల్లో మారుతీ సుజుకీ స్థానం సంపాదించుకుంటోంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో నిర్ణయించుకున్న లక్ష్యానికి వారం ముందుగానే ఈ ఘనత సాధించింది. తొలికారు మారుతీ -800 మోడల్‌ కాగా, 10 లక్షల కారుగా ఎర్రరంగు స్విఫ్ట్‌ను మంగళవారమే ఉత్పత్తి చేయనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ తెలిపారు. ఈ కార్యక్రమానికి సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఒసాము సుజుకీ హాజరవుతున్నారు. గత ఏడాది విక్రయాల్లో జపాన్‌లోని సుజుకీని అధిగమించామని భార్గవ వెల్లడించారు.
* మొదటి మోడల్‌: మారుతీ -800
* తొలికారు ఉత్పత్తి: 1983, డిసెంబరు 14
* ప్లాంటు: గుర్‌గావ్‌
* తొలి ఏడాది (1983 డిసెంబరు - 1984 మార్చి) : 840 కార్లు
* 1984-85లో : 22,000 కార్లు
* ఇప్పటివరకు మోడళ్లు: 15 (100 రకాలు)
* 26 ఏళ్లలో విక్రయించినవి: 85,00,000
* ప్రభుత్వానికి చెల్లింపులు: రూ.55,000 కోట్లు
* విక్రయ కేంద్రాలు: 450 పట్టణాల్లో 681
* మార్కెట్‌ వాటా: 54%
* ఇప్పటివరకు టయోట, జనరల్‌ మోటార్స్‌, ఫోక్స్‌ వ్యాగన్‌, ఫోర్డ్‌, హోండా, రెనాల్ట్‌, హ్యుందాయ్‌, సుజుకి, నిస్సాన్‌ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.