Tuesday, March 23, 2010

గ్యాస్‌ ఉంది.. వినియోగం ఏదీ?

కేజీ బేసిన్‌లో 22 ఓఎన్‌జీసీ బావులకు నిరాదరణ
ఏడాదికి రూ. 650 కోట్ల ఆదాయానికి గండి
సొంతంగా విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు యోచన
దేశంలో సహజవాయువు అవసరం చాలా ఉంది. గ్యాస్‌ అందక అనేక విద్యుత్తు, ఎరువు, రసాయన తదితర కర్మాగారాలు, సంస్థలు ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ బావుల్లో గ్యాస్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నా, అక్కడనుంచి సరఫరాకు అవసరమైన పైపులైను లేక అవి నిష్ప్రయోజనంగా ఉండిపోయాయి.

ఏడెనిమిదేళ్లుగా ఇదే స్థితి: కేజీ బేసిన్‌లో సహజవాయువును కనుగొనేందుకు ఓఎన్‌జీసీ భారీగా ఖర్చుచేసింది. ఒక్కో బావి నిర్మాణానికి రూ.50 కోట్ల వరకు వెచ్చించింది. అయిదేళ్ల వరకు వీటినుంచి సహజవాయువు వెలికి తీయవచ్చని అంచనా. కొన్ని బావులు ప్రధాన గొట్టపు మార్గానికి దూరంగా (ఐసోలేటెడ్‌ వెల్స్‌) ఉంటాయి. ఇప్పటికే సమీపంలో బావులుండి... అక్కడి నుంచి ఒక ప్రధాన పైపులైను ఉండి ఉంటే ఈ గ్యాస్‌ను తరలించే అవకాశం ఉండేది. కానీ ఈ బావులు ప్రధాన పైపులైనుకు సుమారు ఏడెనిమిది కిలోమీటర్లకు పైగా దూరంగా ఉండటం వల్లే ఈ సమస్య వచ్చి పడింది. అవసరమైన సంస్థలకు గ్యాస్‌ సరఫరా చేయలేక ఓఎన్‌జీసీ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. ఇలాంటివి తూర్పుగోదావరి జిల్లాలో 9 బావులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 6 ఉన్నాయి. ఒక్కో బావి నుంచి ఏడాదికి రూ. 30 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అంటే ఈ 22 బావుల నుంచి ఏడాదికి రూ. 650 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఏడెనిమిదేళ్లుగా బావులు ఇలానే ఉంటున్నాయి. ఏటా రెండు, మూడు బావులు అదనంగా వచ్చి చేరుతున్నాయి.

ఇవీ ఇబ్బందులు: సహజవాయువు పొందాలనుకునే సంస్థలు భారీగా ఖర్చు చేసి గొట్టపు మార్గాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ధైర్యం చేసినా, సహజవాయువు ఒత్తిడి తక్కువగా ఉంటే, సంబంధిత పరిశ్రమలకు సరఫరా కాదు. కొన్ని బావుల్లో గ్యాస్‌ కొనుగోలుకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డంకిగా ఉన్నాయని సమచారం.

గుజరాత్‌లో భిన్నం: గ్యాస్‌ నిల్వలకు సమీపంలో ఏదైనా పరిశ్రమ స్థాపించి, నిర్వహించవచ్చు. గుజరాత్‌లోని పారిశ్రామిక వేత్తలు ఇలానే చేస్తున్నారు. కేజీ బేసిన్‌ పరిధిలో ఎవరూ అలా ముందుకు రావడంలేదని ఓఎన్‌జీసీ వర్గాలు చెబుతున్నాయి.

సొంతగా విద్యుత్తు ప్రాజెక్టులు!: సహజవాయువు సద్వినియోగానికి ఆయా బావుల సమీపంలో చిన్నపాటి విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే యోచన కూడా ఓఎన్‌జీసీలో ఉన్నట్లు సమాచారం. కానీ దీనిపై ఆ సంస్థలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్తులో ఆయా బావులకు సమీపంలో మరిన్ని బావులు తవ్వి, పైపులైను నిర్మాణం జరిగితేనే, సహజవాయువు సద్వినియోగం అవుతుంది.

- న్యూస్‌టుడే, రాజమండ్రి
సహజవాయువు ధర 30% పెంపు!
న్యూఢిల్లీ: ఓన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా (ఓఐ) వెలికి తీస్తున్న సహజవాయువు ధర 30% పెంపు.. దేశంలో ప్రధానంగా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో 7,450 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మాణం.. ఇవీ ఢిల్లీలో జరుగుతున్న ఆరో ఆసియా గ్యాస్‌ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మంత్రి మురళీదేవ్‌రా, ఆ శాఖ కార్యదర్శి సుందరేశన్‌ వెల్లడించిన అంశాలివీ. నియంత్రిత ధరల విధానం (ఏపీఎం) కింద వెయ్యి క్యూబిక్‌ మీటర్ల సహజవాయువు ధరను రూ.3200 నుంచి రూ.4,142 కు పెంచనున్నారని పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎస్‌.సుందరేశన్‌ తెలిపారు. కేంద్రప్రభుత్వం అతిత్వరలోనే తుదినిర్ణయం తీసుకోనుందని వివరించారు. 2013 నాటికి ఏపీఎం కింద వెయ్యి క్యూబిక్‌ మీటర్లకు సహజవాయువు ధరను రూ.7500 చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం దేశంలో 270 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల సహజవాయువు సరఫరాకు సరిపడా 10,800 కి.మీ. మేర పైపులైనుఉంది. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో, మారుమూలకు కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో 7,450 కి.మీ. పైపులైను నిర్మిస్తామన్నారు. దేశంలోని 40 పట్టణాలు, నగరాలకు సీఎన్‌జీ సరఫరా చేస్తున్నామని, ఈ సంఖ్యను 200 చేయాలనే నిర్ణయించామని మంత్రి తెలిపారు.