'ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం' అంటూ ప్రచారం చేసుకొనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అధికారులు ఒక సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును నిజామాబాద్ జిల్లా వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక తప్పు పట్టింది.
నిజామాబాద్ విద్యార్థి 16ఏళ్ల సాయి స్వతేజ్ గతేడాది ఏప్రిల్ 28 రాత్రి ఎనిమిదిన్నరకు హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో నిజామాబాద్ బస్సు ఎక్కాడు. బస్సు కామారెడ్డి సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న ఓ లారీని వెనుక నుంచి ఢీకొంది. ఫలితంగా బస్సు ప్రయాణికుల్లో అయిదుగురు గాయపడ్డారు. అందులో సాయి స్వతేజ్ ఒకడు. తీవ్రంగా గాయపడ్డ వారిని ప్రమాద స్థలం నుంచి తరలించారు. మిగిలిన వారిని పట్టించుకోలేదు. బస్సులో ప్రథమ చికిత్స సదుపాయాలు లేవు. స్వల్ప గాయాలైనవారిని, ఇతర ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చడానికి వేరే ఆర్టీసీ బస్సులేవీ ప్రమాదస్థలం వద్ద ఆగలేదు. బస్ డిపో అక్కడికి దగ్గరలోనే ఉన్నా, డిపో అధికారులు చేరుకోలేదు. మధ్య రాత్రి రెండు గంటలకు పైగా ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. రాత్రి 1.40కి సాయి బోధన్ డిపోకు చెందిన బస్సును ఎక్కాడు. తన దగ్గర హైదరాబాద్లో కొన్న టికెట్ ఉంది, తన బస్సు ప్రమాదానికి లోనైందని చెప్పినా ఆ బస్సు కండక్టర్ అంగీకరించకపోవడంతో నిజామాబాద్ వెళ్లడానికి రూ.29 పెట్టి టికెట్టు కొన్నాడు. మూడింటికి గమ్యం చేరుకొన్నాడు. ఆలోపు తన కుమారుడి కోసం ఎదురుచూసిన తండ్రి నీలకంఠరావు మానసిక ఆందోళనకు లోనయ్యారు. తెల్లవారిన తరువాత దంత వైద్యశాలలో చూపించగా పైవరుస మూడు పళ్లకు గాయాలు కావటంతో చికిత్స చేయించారు. దీంతో సాయి తరఫున అతడి తండ్రి వినియోగదారుల వేదికను ఆశ్రయించారు. క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియా చెల్లించామంటూ ఆర్టీసీ కౌంటర్: డ్రైవరు దుందుడుకుతనంతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నట్లు, ప్రమాదం అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. ప్రత్యర్థి పక్షాలైన నిజామాబాద్, బోధన్ బస్ డిపోల అధికారులు, ఆర్టీసీ కౌంటర్ దాఖలు చేశాయి. పార్కింగ్ లైట్లు వెలిగించకుండా లారీని ఆపి ఉంచడం వల్ల ప్రమాదం జరిగిందని, నిరుడు ఏప్రిల్ 29వ తేదీ రాత్రి భిక్కనూర్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు దాఖలు చేసినట్లు కౌంటర్లో పేర్కొన్నారు. ప్రమాదం మధ్య రాత్రి జరిగినందువల్ల ఆర్టీసీ సిబ్బంది తక్షణం ప్రమాద స్థలికి చేరుకోలేకపోయినట్లు, తీవ్రంగా క్షతగాత్రులైన వారిని డ్రైవరు సహా 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి, ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న నలుగురికి ఎక్స్గ్రేషియాను కూడా చెల్లించినట్లు తెలిపారు. సాయి పేరు నమోదు కాలేదని వివరించారు.
ఇదీ తీర్పు: సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్లోని 128వ రూల్ ప్రకారం బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో మందులు తప్పనిసరిగా ఉండాలని ఫోరమ్ స్పష్టం చేసింది. బస్సు నిజామాబాద్ డిపోకు చెందినదైనంత మాత్రాన అదే డిపో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలన్న వివరణ సరి కాదని ఫోరమ్ అభిప్రాయపడింది. అన్ని డిపోలు ఆర్టీసీవేనంది. వన్మ్యాన్ సర్వీసు కాబట్టి వేరే బస్సు కండక్టర్ ఆ బస్సు ప్రయాణికులను మళ్లీ టికెట్ కొననిదే ఎక్కించుకోరు అనడం కూడా ఆమోదయోగ్యంగా లేదంది. ప్రత్యర్థి పక్షాలు సేవాలోపానికి బాధ్యులని పేర్కొంది. కాబట్టి ఫిర్యాదుదారు రెండోసారి బస్ టికెట్ కోసం చెల్లించిన రూ.29, వైద్య ఖర్చులకు రూ.500, సేవాలోపం, మానసిక ఆందోళనలకు పరిహారం కింద మరో రూ.5,000, ఫిర్యాదు ఖర్చుల కింద రూ.1,000 చెల్లించాలని ఆర్టీసీ ఎండీని, ఆర్టీసీ నిజామాబాద్, బోధన్ డిపోల మేనేజర్లను ఆదేశిస్తూ వేదిక గత నెల 24న తీర్పు చెప్పింది.