Monday, March 22, 2010

టెలికాంలో లక్ష కొలువులు

టెలికాంలో లక్ష కొలువులు
న్యూఢిల్లీ: భారత్‌లో టెలికాం రంగం జోరు వచ్చే ఏడాది కూడా కొనసాగనుందని, ఫలితంగా ఈవిభాగంలో కొత్తగా లక్షకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ & యంగ్‌ (ఈ&వై) తెలిపింది. భారత్‌లో ఉద్యోగ నియామకాల మార్కెట్‌ మళ్లీపట్టాలెక్కిందని ఈసంస్థ విశ్లేషించింది. ఉద్యోగ నియామకాలలో కొత్త ఆర్థిక సంవత్సరంలో 10-15 శాతం వృద్ధి నమోదు కావచ్చని సంస్థ భాగస్వామి, పీపుల్‌-ఆర్గనైజేషన్‌ విభాగం జాతీయ అధ్యక్షుడు ఎన్‌ఎస్‌ రాజన్‌ తెలిపారు. వ్యవస్థలో విద్య, ఔషధ, రసాయన, వాహన, బీమా, ఐటీ, రిటైల్‌ తదితర రంగాల్లో కొత్త నియామకాలు పుంజుకుందని మరో ఏడాది లోపే 2007 నాటి బుల్లిష్‌ ధోరణిని కనిపించే అవకాశం ఉన్నట్లు వివరించారు.

&వై అధ్యయనంలోని ఇతర ప్రధాన అంశాలు:
* కొత్త ఆర్థిక సంవత్సరంలో ఔషధ, ఎఫ్‌ఎంసీజీ, విద్యా రంగాల్లోనూ ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. అయితేఈ రంగాలు ఇప్పటికే నిపుణుల కొరత ఎదుర్కొంటున్నాయి.

* మందగమనం నుంచి నేర్చుకున్న గుణపాఠాల మూలంగా కంపెనీలు నియామకాల విషయంలో రక్షణాత్మకంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి.

* మాంద్యం పాఠాలతో కంపెనీలు ఇంతకు ముందులా కాకుండా, దీర్ఘకాలిక అవసరాల మేరకే నియామకాలు చేపట్టవచ్చు.

* ప్రతికూల పరిస్థితుల మూలంగా గత ఏడాది ఉద్యోగ నియామకాలను నిలిపివేయడం వల్ల ఏర్పడిన గిరాకీని అధిగమంచే దిశగా తాజా ఉద్యోగ నియామకాలు సాగుతాయి. నియామకాల స్థాయి ఆయా రంగాల్లో మిశ్రమంగా ఉండవచ్చు.

* గడ్డు పరిస్థితుల కారణంగా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేసుకున్న వాహన, వాహన పరికరాల తయారీ, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, స్థిరాస్తి రంగాల్లో కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ప్రాథమిక నియామకాలు జరుపుతాయి.

* నియామకాలు మళ్లీ పుంజుకొంటుండడంతో రానున్న కొన్ని నెలల్లో ఉద్యోగ వలసలు భారీగా ఉండే అవకాశాలున్నట్లు కంపెనీలు భావిస్తున్నాయి.

భారత్‌లో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు: విన్‌కోర్‌ నిక్స్‌డోర్ఫ్‌
బ్యాంకులకు ఐటీ, ఏటీఎం సేవలను అందించే విన్‌కోర్‌ నిక్స్‌డోర్ఫ్‌ భారత్‌లో మరింతగా విస్తరించనుంది. ఇందులో భాగంగా ఈ సంస్థ ముంబయిలో కేంద్రీకృత కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. దీనివల్ల ఆయా బ్యాంకులకు సేవల్లో జాప్యాన్ని, ఇతర సాంకేతిక అవాంతరాలను వేగంగా నివారించేందుకు వీలవుతుందని ఆసంస్థ వివరించింది. దీనికి తోడు తాజా నియామకాలతో ఉద్యోగ సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కూడా సంస్థ వెల్లడించింది.

4,200 మందికి ఉద్వాసన: సీమెన్స్‌
ఫ్రాంక్‌ఫర్ట్‌/న్యూఢిల్లీ: సీమెన్స్‌ 2011 నాటికి సుమారు 4200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే సీమెన్స్‌ ఐటీ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌లో (ఎస్‌ఐఎస్‌లో) ఈ ఉద్వాసనలు ఉండనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్వాసనల్లో భాగంగా కేవలం జర్మనీలోనే సుమారు 2000ఉద్యోగులను తొలగించనున్నట్లు సీమెన్స్‌ వివరించింది. దీనికి తోడు ఐటీ విభాగాన్ని ప్రత్యేక వ్యాపారంగా మార్చాలని కూడా సీమెన్స్‌ భావిస్తోంది.ఎస్‌ఐఎస్‌లో ప్రస్తుతం మొత్తం 35,000 మంది ఉద్యోగులు ఉన్నారు. మిగతా కోతలు ఏఏ దేశాల్లో చేపట్టనున్నది సంస్థ వెల్లడించలేదు. సంస్థకు చెందిన భారత విభాగంలో ప్రత్యక్షంగా 17000 మంది ఉపాధి పొందుతున్నారు.